సికింద్రాబాద్లోని మినిస్టర్ రోడ్డులో ఇటీవల భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న డెక్కన్ మాల్ భవనాన్ని కూల్చివేయడానికి బల్దియా సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూల్చివేత ప్రక్రియలో భాగంగా బుధవారం టెండర్ల ప్రక్రియ పూర్తవగా, రూ.33.86 లక్షల అంచనా వ్యయంతో టెండర్ వేసిన మాలిక్ ట్రేడర్స్ ఏజెన్సీకి పనులు అప్పగించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భవనం కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాయి. కాగా చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా హైడ్రాలిక్ క్రషర్ డెమోలిషన్ పద్ధతిలో ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్లు బల్దియా తెలిపింది. డైమండ్ కటింగ్ విధానం ద్వారా భవనం ఒక్కసారిగా కూలిపోకుండా, ఒరిగిపోకుండా కూల్చివేయడం హైడ్రాలిక్ క్రషర్ యంత్రం యొక్క ప్రత్యేకత. ఇక వారం, పది రోజుల్లో డెక్కన్ మాల్ భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామని బల్దియా అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. భవనం కూల్చివేత సమయంలో ఇతర భవనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీకి సూచించామని తెలిపారు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని రాంగోపాల్ పేట వాసులకు హామీ ఇచ్చారు. కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులకు ఆయన సూచించారు. డెక్కన్ బిల్డింగ్ సమీపంలోని కమ్యూనిటీ హాల్లో ఈ ప్రాంత ప్రజలకు వసతి ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి కూడా భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఫైరింజన్ సహా భవనం వద్దకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE