ఆసరా పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అమలు అవుతున్న ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, దళిత బంధు తదితర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, ఆసరా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు కార్డుల పంపిణీని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పెన్షన్ల కోసం నూతనంగా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు విచారణ జరిపి అర్హులకు పెన్షన్లను మంజూరు చేయాలని చెప్పారు. పెన్షన్ల సమస్య సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. అలాగే నియోజకవర్గ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన వారికి అందజేయడం జరిగిందని తెలిపారు. ఇంకా మిగిలిన ఇండ్లను అర్హులైన వారిని గుర్తించి కేటాయింపు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు కార్యక్రమం కింద మొదటి విడతలో నియోజకవర్గ పరిధిలో 100 మంది లబ్ధిదారులకు వివిధ యూనిట్ల కోసం ఒకొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. లబ్ధిదారుల వద్ద ప్రభుత్వం అందించిన యూనిట్లు ఉన్నాయా, సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. రెండో విడతలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నదని తెలిపారు. లబ్ధిదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే యూనిట్ లను ఎంపిక చేసుకొనే విధంగా అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
నియోజకవర్గ పరిధిలోని ప్రజల నీటి అవసరాలను తీర్చడం కోసం తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి బోర్ వెల్స్ ఏర్పాటు చేస్తున్నా, వివిధ కారణాలతో సకాలంలో విద్యుత్ కనెక్షన్ లు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని, వాటిని ప్రజలకు వినియోగంలోకి తీసుకురావడం ఆలస్యం అవుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ఇక ముందు అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో ఒక్కో డివిజన్ రెండు, మూడు మండలాల పరిధిలో ఉన్నాయని, దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఒకే మండల పరిధిలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్డీవో వసంత, తహసీల్దార్లు శైలజ,విష్ణు సాగర్, అన్వర్ హుస్సేన్, అయ్యప్ప, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE