ముఖ్యమంత్రి కేసీఆర్ మేధోమదనం నుంచి పుట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు తెలంగాణ సమగ్రాభివృద్ధికి నాంది పలికాయని, పల్లెలు, పట్టణాలు స్వరూపం మారిందని మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అదే స్ఫూర్తితో 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంపై మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 15 రోజుల పాటు కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గతంలో చేపట్టిన, తాజాగా చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.
పల్లెల అభివృద్ధి కోసం రూ.8963 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ.2748 కోట్లు ఖర్చు:
పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం దేశంలోని ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 2019, సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు తొలిగా ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, పారిశుద్ధ్య పనులు చేసుకోవడంతో పాటు గ్రామానికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు పల్లెల అభివృద్ధి కోసం రూ.8,963 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ.2,748 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తంగా రూ. 11,711 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 514.3 కోట్లు చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వివిధ దశల్లో చెల్లింపుల కోసం ఉన్న సుమారు రూ.285 కోట్ల రూపాయలను రాబోయే రెండు మూడు రోజుల్లో చెల్లించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకం కింద ఎటువంటి బకాయిలు లేకుండా పూర్తి చెల్లింపులు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ, సమగ్ర ప్రణాళికతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం మంచి ఫలితాలను రాబట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో 20 ఉత్తమ గ్రామాలు ఎంపిక చేస్తే, అందులో 19 తెలంగాణకు చెందినవి ఉండటం దీనికి నిదర్శనం అన్నారు. హరిత హారం, పల్లె ప్రకృతి వనాల వల్ల రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.7శాతం పెరిగిందని, ఆకుపచ్చ తెలంగాణ సాగుతుందన్నారు.
కేంద్రం నుంచి నయా పైసా రాలేదు:
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు గాను సుమారు రూ.1100 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందని, అట్టి నిధులను వెంటనే విడుదల చేయాలు మే మొదటి వారంలోనే కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావొస్తున్నప్పటికీ కేంద్రం ఉపాధి హామిహామీ కింద నయా పైసా విడుదల చేయలేదన్నారు. దీంతో చేసిన పనులకు బిల్లులు రాక వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారని, రెండు నెలలు గడిచినప్పటికీ కేంద్రం నయా పైసా విడుదల చేయకపోవడంతో మరొకసారి కేంద్రానికి లేఖ రాసి, ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడాలని, నిధులు విడుదల చేసేలా తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే త్వరితగతిన చెల్లింపులు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.1013 కోట్లు ఇవ్వలేదని, అయినప్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు, పట్టణాల అభివృద్ధికి గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,613 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. గతంలో పూర్తి చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల స్పూర్తితో, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుని ఈ విడత కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని, ఆ దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF