కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జూలై 2, గురువారం నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓ, బోర్డ్ సభ్యులు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావును ఆయన కార్యాలయంలో కలిసారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి, ఆప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నుండి రావలసిన 80 కోట్ల ను విడుదల చేయాలని కోరారు. బుధవారం నాడు కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులకు నిధులు లేవని, ప్రభుత్వమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని బోర్డు సభ్యులు మంత్రులను కోరారు. ఈ మేరకు గురువారం ఆర్ధిక శాఖ మంత్రి ని కలిసి పరిస్థితులను వివరించారు.
ఈ సందర్భంగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, కానీ అక్కడి ప్రజల బాగోగులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని కారణంగా దేశంలోని ఏ కంటోన్మెంట్ లో లేని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ వర్తింప చేస్తుందని చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 10 కోట్ల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu