ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ వరద సాయంపై ప్రస్తావన వచ్చింది.
‘‘ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరదలు ముంచెత్తాయి. దీనివల్ల అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగింది. దాదాపు 5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, రూ.1350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని సీఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అక్టోబర్ 15న లేఖ రాశారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. సీఎంతో వారు స్వయంగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసింది. ఇంత జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందుతుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు’’ అని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అనే విషయంలో మరోసారి నిరూపణ అయిందని సీఎం కేసీఆర్ అన్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరానికి నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ