రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో 17వ తేదీన నిర్వహించే సభ ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతలతో కలిసి గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ వజ్రోత్సవాలలో భాగంగా 16వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని, 17వ తేదీ సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతురని తెలిపారు.
ఇక 17వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటలకు పీవీమార్గ్ లోని పీపుల్స్ ప్లాజా నుండి సెక్రెటరియేట్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు చేరుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి గిరిజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పారు. గిరిజన సంప్రదాయాలను తెలియజెప్పే విధంగా కళాకారులచే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సుమారు 5 వేల మంది కళాకారులు వివిధ వేష ధారణలతో కళా ప్రదర్శనలు నిర్వహిస్తారని మంత్రి చెప్పారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం:
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ 8 సంవత్సరాల నుండి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. విద్య, ఉద్యోగం అనేక రంగాలలో సమన్యాయం జరగాలనే ఆలోచనతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ఎంతో మంది ప్రయోజనం పొందారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరును తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టడం నిజంగా హర్షణీయం అన్నారు. అంబేద్కర్ సేవలు, కృషికి గౌరవంగా ప్రభుత్వం 125 అడుగుల విగ్రహం నిర్మాణాన్ని చేపట్టిందని, ముమ్మరంగా పనులు సాగుతున్నాయని చెప్పారు. నూతనంగా పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY