మొన్నటి వరకు తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ.. సరిగ్గా ఎన్నికలొచ్చే సరికి డీలా పడిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల పోరులో ఫైట్ చేస్తుంటే.. బీజేపీ మాత్రం వెనుకుంజలో ఉండిపోయింది. తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవన్నీ విఫలమే అవుతున్నాయి. అన్ని మార్గాలు మూసుకుపోవడంతో బీజేపీ పొత్తుల వైపు చూస్తోంది. జనసేనతో పొత్తుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పలుమార్లు పొత్తు అంశంపై పవన్ కల్యాణ్తో మంతనాలు జరిపారు. తెలంగాణలో పోటీ చేయకుండా తమకు మద్ధతు ఇవ్వాలని జనసేనానిని కోరారు. అప్పటికే జనసేనాని తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తానని ఆయా నియోజకవర్గాల పేర్లను కూడా ప్రకటించారు. దీంతో జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదురుతుందా?.. జనసేనాని అడిగిన సీట్లను బీజేపీ ఇస్తుందా?.. డీలా పడిన కాషాయపు పార్టీలో జనసేనాని కొత్త ఉత్సాహం నింపుతారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
ఈ సమయంలో.. బుధవారం కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ కలిసి ఢిల్లీకి వెళ్లారు. హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని పవన్, కిషన్ రెడ్డిలకు అమిత్ షా సూచించారట. తాను హైదరాబాద్ వచ్చే లోపు టికెట్ల సర్దుబాటు అంశం తేలిపోవాలని అన్నారట. అంతేకాకుండా 30కి పైగా సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని.. పరిస్థితులకు తగ్గట్లుగా ముందుకు వెళ్దామని పవన్ కల్యాణ్కు సూచించారట.
అయితే అమిత్ షా హైదరాబాద్కు రావడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఆయన శుక్రవారం హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు. ఈక్రమంలో కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్లు సీట్ల సర్దుబాటు అంశంపై తేల్చుకునే పనిలో పడ్డారట. ఈరోజు సాయంత్రం వరకు బీజేపీ, జనసేనల పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఎవరెన్ని స్థానాల నుంచి పోటీ చేస్తారన్నది కూడా తేలిపోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ