ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 21, మంగళవారం ఉదయం మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కవిత ఈడీ విచారణకు హాజరు కావడం ఇది మూడోసారి. మార్చి 11న తొలిసారిగా, మార్చి 20న రెండోసారి ఆమె ఈడీ విచారణకు హాజరుకాగా, గంటలకుపైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మూడో సారి ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. గతంలో తాను వాడిన ఫోన్లు అన్నింటిని సమర్పిస్తున్నాని చెప్పారు. కాగా మంగళవారం ఉదయం తుగ్లక్ రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయల్దేరిన సమయంలో ప్లాస్టిక్ కవర్స్ లో ఉన్న ఫోన్లను ఎమ్మెల్సీ కవిత మీడియాకు చూపించారు.
ఈడీ దర్యాప్తు అధికారి జోగేందర్ కు రాసిన లేఖలో ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా తప్పుపట్టారు. “ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా?, దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది?, నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును, మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం” అని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE