హైదరాబాద్ శివారు శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం 8వ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ మరియు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. చినజీయర్ స్వామి దగ్గరుండి వారికి అక్కడి ఏర్పాట్లను వివరించారు. ఈ క్రమంలో.. వారిరువురు శ్రీ భగవద్రామానుజాచార్యుల 216 అడుగుల ‘సమతామూర్తి‘ విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం చినజీయర్ స్వామితో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
ఈ సందర్భంగా రామానుజాచార్యుల వేడుకలకు రావడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని వారు తెలిపారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంలో మన పూర్వీకుల కృషి ఎంతో ఉందని భగవత్ అన్నారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తోందని ప్రపంచమంతా కొనియాడుతోందంటే దానికి కారణం సనాతన ధర్మం అని భగవత్ అన్నారు. శ్రీ రామానుజుల ప్రబోధాలు సదా అనుసరణీయం అని శివరాజ్ అన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి వారికి శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞత తెలియజేశారు.
శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన ఆరంభమైన ఈ మహాక్రతువును ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అష్టాష్టరీ మంత్ర పఠనం.. పెరుమాళ్ ప్రాతఃకాల ఆరాధన.. శ్రీలక్ష్మీనారాయణ మహా యజ్ఞం.. హయగ్రీవపూజ.. నేటి సహస్రాబ్ది ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. ఈ క్రమంలో.. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీ రామానుజాచార్యుల ‘సమతామూర్తి’ విగ్రహాన్ని దర్శించుకుని భక్తజనం పులకించిపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ