మునుగోడు ఉప ఎన్నికలో నేడు కీలక ఘట్టానికి తెర లేచింది. బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు బంగారి గెడ్డ నుంచి ఆర్వో కార్యాలయం వరకు సుమారు 50 వేల మందితో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లిన ఆయన చండూరులో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్, సహ ఇన్చార్జి అరవింద్ మీనన్, ఎంపీ లక్ష్మణ్, సునీల్ బన్సల్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునాధన్ రావు, ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్, కోఆర్డినేటర్ గంగిడి మనోహర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ఇంకా పలువురు స్టీరింగ్ కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
ఇక నామినేషన్ అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికలపై తెలంగాణలోనే కాదని, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఈ నేపథ్యంలో మునుగోడు ప్రజలు త్వరలో చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ కానీ, ఆయన కుమారుడు కేటీఆర్ కానీ తనపై పోటీ చేస్తారా? అని ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి.. తన గెలుపుని అడ్డుకోవడం ఎవరితరం కాదని చెప్పారు. కాగా ఈరోజు సాయంత్రం భాజపా నేతలు ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ముఖ్య నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ లు మండల ఇంఛార్జులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రచారం ముగిసేవరకు పార్టీ ఇంఛార్జులు నియోజకవర్గంలోనే ఉండాల్సిందిగా బండి సంజయ్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY