మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా చండూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభకు ఆయన హాజరయ్యారు. ర్యాలీలో భాగంగా ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నవంబర్ 6 తర్వాత ప్రతి మూడు నెలలకొకసారి వచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మునుగోడులో ఫ్లోరైడ్ సమస్యకు మిషన్ భగీరథ ద్వారా సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
నల్లగొండ జిల్లాను ఆనుకొని కృష్ణా నది వెళ్తున్నా ఇక్కడి నాయకులు కనీసం ఒక్క రిజర్వాయర్ కూడా కట్టలేకపోయారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చెర్లగూడెం, శివన్నగూడెం రిజర్వాయర్లు నిర్మించారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. పదేళ్ల క్రితం మునుగోడు ఎలా ఉండేదో? నేడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. మునుగోడులో ఫ్లోరోసిస్ మహమ్మారిని నిర్మూలించడానికి రూ. 19 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫార్స్ చేస్తే, కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం మాత్రం దానికి బదులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్లు కాంట్రాక్టులిచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఇక ప్రజలకోసం అభివృద్ధి చేస్తోందెవరో.. సొంత వ్యాపారాలు చేసుకుంటుందెవరో గమనించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY