మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉపఎన్నికలో రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా, 93.13 శాతం అనగా 2,25,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే మరో 686 పోస్టల్ ఓట్లు కూడా పోలయ్యాయని చెప్పారు. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో 91.27% పోలింగ్ నమోదు కాగా, ఇప్పటివరకు అదే రికార్డుగా ఉంది. తాజాగా మునుగోడు ఉపఎన్నిక 93.13 శాతం నమోదవడంతో ఇదే అత్యధిక పోలింగ్ శాతంగా నిలవనుంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలో కూడా మునుగోడులో 91.07 పోలింగ్ శాతం నమోదైంది. దీంతో మునుగోడు ఓటర్లు మరోసారి చైతన్యం చూపించి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి సమయం దాటినా కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం కొంత మందకొడిగా సాగిన పోలింగ్, మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీగా పుంజుకుంది. కొన్ని కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్టు తెలుస్తుంది. మునుగోడు ఉపఎన్నికలో భాగంగా అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగియడంతో మునుగోడు బరిలో ఉన్న 47 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను నల్గొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించి, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. నవంబర్ 6, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించిఎం అదే రోజున ఫలితాన్నీ ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE