అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను పార్టీ ఫిరాయించాలంటూ ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు వ్యవహారం నడవడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక ముగిసిన వెంటనే గురువారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రమేయంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మొయినాబాద్ లోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫార్మ్ హౌజ్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సాగిన బేరసారాలకు సంబంధించిన 5 వీడియోలను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఎమ్మెల్యేలను బీజేపీకి చెందిన ఏజెంట్స్ ఏ విధంగా సంప్రదించారు, ఎన్ని కోట్లు ఆఫర్ చేశారు, ఏజెంట్ల ఐడెంటిటీ ప్రూఫ్స్ ఎన్ని పేర్లతో ఉన్నాయి?, వారు ఏఏ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని చెప్పారు?, తర్వాత తెలంగాణతో పాటుగా ఏఏ రాష్ట్రాలలోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తున్నారనే విషయాలను సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వివరించారు.
ఈ బేరసారాల వీడియోలను, ఆడియోలను, ఏజెంట్ల కాల్ డాటాను, వారి అనేక రకాల ఐడెంటిటీ ప్రూఫ్స్ ను సుప్రీంకోర్టు సీజేఐ, మిగతా జడ్జీలు, అన్ని హైకోర్టుల సీజేఐలకు, దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, సీబీఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు, కేంద్ర ఎన్నికల సంఘం, అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలకు, రాష్ట్రాల డీజీపీలకు, పీటీఐ, ఏఎన్ఐ సహా దేశంలోని అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు, పత్రికాధిపతులకు కూడా పంపుతున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ దేశ ప్రజాస్వామ్యంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఈ దురాగతాలను, ఘాతుకాన్ని తెలుసుకోవాలని, అందుకే ఇంత మందికి ఈ ఎవిడెన్స్ లను పంపిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “చాలా భారమైన మనసుతో, దుఃఖంతో ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నాను. దుర్మార్గమైన పరిస్థితులు దేశంలో నడుస్తున్నాయి. ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం, నష్టం కలిగిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అరాచకాలపై అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే. 8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని అన్ని రంగాల్లో వెనుకపడేసింది. కొందరు నేతలు అడ్డుఅదుపు లేకుండా పెద్ద నోరేసుకోని వెకిలి చేష్టలు చేస్తున్నారు. తాజాగా మునుగోడు ఉపఎన్నికల్లో కూడా ఎన్ని వింతలు చూడాలో అన్ని చూశాము. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి రెడ్డి నన్ను కలిసినట్లు ఆరోపణలు చేశారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి గెలుపోవటం అనేవి సహజం. ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించాలి. ఎన్నికల కమిషన్ కూడా ఫెయిల్యూర్ అయిందని దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎవరూ ఊహించని అంశాలు తెలిసినాక షాక్ అయ్యాను. రామచంద్ర భారతి గత నెలలో విశ్వప్రయత్నం చేసి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. రామచంద్ర భారతి తనను సంప్రదించినట్టు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నాకు చెప్పాడు. వారి ప్లాన్ మాకు అర్థమయ్యే వెంటనే హోం మంత్రి కంప్లైంట్ ఇచ్చాం. ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టుకు సుమారు మూడు గంటలు నిడివి గల వీడియోలు సబ్మిట్ చేశాం. ఇవన్నీ పెద్ద పెద్ద ద్రోహాలు. ఇందులో మేము ముగ్గురమే కాదు మొత్తం 24 మంది ఉన్నామంటూ ఏజెంట్స్ చెప్తున్నారు. ఈ ఫార్మ్ హౌజ్ వ్యవహారం లో తుషార్ అనే కేరళ కి చెందిన వ్యక్తి కీలకంగా కూడా ఉన్నాడు. అతను రాహుల్ గాంధీ పైన పోటీ చేశాడు. ఏజెంట్స్ అందరూ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మార్పులు చేర్పులు చేసి ఒక్కొక్కళ్ళకి మూడు మూడు కార్డులు సృష్టించుకున్నారు. ఒక వ్యక్తే పలు పేర్లతో ఫోర్జరీ చేసుకున్నారు. ఏదైయితే అదే అవుతుందని అన్ని బయటపెడుతున్నాం. దేనికోసమైనా సిద్ధం. దేశం కోసం చావడానికి అయినా సిద్ధమే” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE