తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రికార్డు సమయంలో ఒకే రోజు 50.84 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.5294.53 కోట్లు జమ చేశామని చెప్పారు. జూన్ 22, సోమవారం ఉదయం 10 గంటల నుండి గంటకు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని అన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ (ఏజెన్సీ) పట్టాదారులకు చెందిన 63,477 మంది రైతులకు సంబంధించిన ఖాతాల్లో కూడా రూ.82.37 కోట్లు జమ చేశామన్నారు.
“జూన్ 16 వరకు పాస్ బుక్ లు వచ్చిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు వర్తిస్తుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో నిధులు జమ చేయడం జరిగింది. ఇప్పటికి బ్యాంకు వివరాలు ఇవ్వని 5 లక్షల మంది రైతులు వివరాలు ఏఈఓలకు అందగానే వారి ఖాతాలలో నిధులు జమచేయాలని ఆదేశాలు ఇచ్చాం. కరోనా విపత్తులోనూ రాష్ట్రప్రభుత్వం రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసింది. రెండు సీజన్ల రైతుబంధు కోసం బడ్జెట్ లో రూ.14 వేల కోట్లు కేటాయించాము. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలకు ఇది తార్కాణం. రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికే ఆదర్శం, ప్రపంచంలోనే ఎక్కడా లేని మొదటి పథకం రైతుబంధు. సీఎం దూరదృష్టితోనే ఈ పథకం సాధ్యమయిందని” మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu