బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో, కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో తీసుకొంటున్న పలు చర్యలను ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు పరిశీలించారు. ముఖ్యంగా హాస్పిటల్ కు వచ్చే పెషెంట్లను భవనంలోనికి ప్రవేశించడానికి ముందుగా స్క్రీనింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన బృందాలను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం హాస్పిటల్ లోనికి ప్రవేశించే వారికోసం ఏర్పాటు చేసిన శానిటైజేషన్ సౌకర్యాలు, ఆ తర్వాత సిబ్బంది తీసుకొంటున్న చర్యలను వాకబు చేశారు. అలానే పేషెంట్ తో పాటూ వచ్చిన వారు వేచి ఉండడానికి చేసిన ఏర్పాట్లపై చర్చించారు. పలువురు పేషెంట్లను పరామర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను బాలకృష్ణ అడిగి తెలుసుకొన్నారు.
ఇలా రెండు గంటలకు పైగా హాస్పిటల్ లోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించిన అనంతరం లాక్ డౌన్ సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై హాస్పిటల్ లోని కీలక అధికారులు, వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమై కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ సీఈవో డా.ఆర్.వి ప్రభాకర రావు మరియు మెడికల్ డైరెక్టర్ డా.టి.యస్ రావులు కోవిడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు జాగ్రత్తలను వివరించారు.
అనంతరం హాస్పిటల్ లో పని చేస్తున్నసుమారు 400 వందలకు పైగా హౌస్ కీపింగ్ సిబ్బందికి సంస్థ తరపున నిత్యావసర వస్తువులను బాలకృష్ణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో నందమూరి బాలకృష్ణతో డా.ఆర్.వి ప్రభాకర రావు, డా.టియస్ రావు, జి.రవి కుమార్, డా.ఫణి కోటేశ్వర రావులతో పాటుగా పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]