2016లో షాద్ నగర్ దగ్గర జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్స్టర్ నయీం మరణించిన సంగతి తెలిసిందే, అయితే చాలా కాలం పాటు నయీం కేసులో విచారణ జరిగింది కానీ పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఇప్పుడు గ్యాంగ్స్టర్ నయీం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ సమాచార హక్కు చట్టం కింద నయీం కేసు వివరాలు ఇవ్వాలని కేసు దర్యాప్తు చేసిన అధికారులని కోరింది. వివరాల ప్రకారం అనేక మంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు పేర్లు బయటకు వచ్చాయి. ఈ కేసులో సిట్ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం ఎనిమిది మంది రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.
దాదాపు 25 మంది పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్టు, కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. రాజకీయ నాయకులలో బీసీ సంఘాల నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తో పాటు భువనగిరి మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, వెలిగొండ మాజీ ఎంపీపీ నాగరాజు, భువనగిరి మాజీ ఎంపీపీ నాగరాజు, భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, , భువనగిరి మాజీ సర్పంచ్ పింగళ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ్, వెల్దండ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య వంటి పేర్లు బయట పడ్డాయి. రూ. 500 కోట్ల విలువ చేసే 1015 ఎకరాలు నయీం కబ్జా చేసినట్టు తెలియజేసారు. నయీం పై మొత్తం 250 కేసులు నమోదు చేసినట్టు సమాధానంగా వారికీ తెలిపారని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి కోరారు.
[subscribe]
[youtube_video videoid=XYb5AzpdjJU]