కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. మూడురోజుల్లో ఈ లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాతి నిర్ణయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరిగా లాక్డౌన్ పై కేంద్రం ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోకముందే పంజాబ్ రాష్ట్రంలో మే 17 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏప్రిల్ 27, బుధవారం నాడు వెల్లడించారు. మే 3వ తేదీ నుంచి మరో రెండు వారాలపాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎం అమరీందర్ సింగ్ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.
అలాగే రాష్ట్రంలో కర్ఫ్యూ నేపథ్యంలో ప్రతిరోజూ కేవలం నాలుగు గంటలపాటు సడలింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అనుమతులు కేవలం నాన్- రెడ్ జోన్లు, నాన్-కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే వర్తిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా నిత్యవసర వస్తువుల కోసం బయటకు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులను కచ్చితంగా వాడాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా మహమ్మారి ఇంకా వ్యాప్తి చెందుతున్నందు వలన కర్ఫ్యూ పొడిగింపు అవసరమని సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu