తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉండటంతో అభ్యర్ధులంతా తమ ప్రచారాలను మరింత వేగవంతం చేశారు. రోజుకు 4,5 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. ఈనెల 28తో ప్రచారానికి తెరపడనుంది. అయితే అన్ని పార్టీలకు అప్పటి నుంచి పోల్ మేనేజ్మెంటే కీలకం కానుంది.
ముఖ్యంగా నెక్ టూ నెక్ ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్ పార్టీలకు చాలా కీలకం అవుతుంది. అందుకే ఇప్పటి నుంచే ఆయా పార్టీల పెద్దల ఆదేశాలతో అభ్యర్థులు బూత్ స్థాయి కమిటీలపై దృష్టి సారించారు. గ్రామ స్థాయిలో ఉన్న లోకల్ లీడర్స్ను అలర్ట్ చేస్తున్నారు. పోలింగ్కు ముందు రోజు ఆ గ్రామాలలో ఉన్న ఓటర్లందరినీ డబ్బులు, లిక్కర్తో ప్రలోభ పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
పోల్ మేనేజ్మెంట్లో అన్ని పార్టీల కంటే కూడా బీఆర్ఎస్ ముందున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులంతా గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించడమే కాకుండా.. గ్రామస్థాయి నాయకులను కూడా సిద్ధం చేశారు. ఓటర్ల మొబిలైజేషన్తో పాటు ఓటర్లతో ఓటు వేయించే బాధ్యతను ఆయా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు అప్పగించేసారు. అయితే సాధారణంగానే అధికార పార్టీ నాయకులకు ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది కాస్త సులభంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నది వారే కాబట్టి..వారికి తెలిసిన ఉన్నతాధికారులు, పోలీసులు ఉంటారు. కానీ అన్ని చోట్ల అధికార పార్టీకి పోల్ మేనేజ్మెంట్ సులభం కాదని గుర్తుంచుకోవాలి.
2014 ఎన్నికల సమయాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే.. బీఆర్ఎస్కు గ్రామస్థాయిలో పటిష్ఠమైన కేడర్ లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ ఇతర ప్రధాన పార్టీల కంటే కూడా బలహీనంగా ఉండేది. అయినా కూడా అలాంటి పరిస్థితుల మధ్య బలంగా తమను తాము నిరూపించుకుని అధికారంలోకి వచ్చింది. అదే బీఆర్ఎస్ 2018లో జరిగిన ఎన్నికలలో అద్భుతమైన పోల్ మేనేజ్మెంట్తో ముందుకెళ్లి విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే పోల్ మేనేజ్మెంట్ సూత్రాన్ని ఫాలో అయి.. మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇటు బీఆర్ఎస్తో పోల్చుకుంటే కాంగ్రెస్, బీజేపీలు పోల్ మేనేజ్మెంట్లో చాలా వెనుకబడినట్లే కనిపిస్తున్నాయి. అవగాహన లేక కొంతమంది..అతి నమ్మకంతో మరికొంతమంది పోల్ మేనేజ్మెంట్ను తేలికగా తీసుకుంటున్నారు. ఇక చాలా మంది కాంగ్రెస్ నేతలు అయితే తెలంగాణలో హస్తం గాలి వీస్తుందని వచ్చిన కొన్ని సర్వేల లెక్కలతో పోల్ మేనేజ్మెంట్ను నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్లక్ష్యం వల్ల ఆ పార్టీని దెబ్బ కొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే పోల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేస్తుండగా.. మరి కొందరు లైట్ తీసుకుంటున్నారు. ఇక బీజేపీ అయితే కొన్ని చోట్ల మాత్రమే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో 10 నుంచి 15 స్థానాల్లో మాత్రం ఎక్కువగా పోటీ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా కూడా కేవలం వెయ్యి నుంచి ఐదు వేల ఓట్ల తేడాతో గెలిచే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఇక్కడ ప్రతీ ఓటు కీలకం కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఆ ప్రాంతాలలో బీఆర్ఎస్ ఇప్పటికే తన పోల్ మేనేజ్మెంట్తో దూసుకుపోతోంది. ఇలాంటి చోట్ల పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసిన వారే..ఈ ఎన్నికలలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE