తెలంగాణలో పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ అభ్యర్థులలో టెన్షన్ ఎక్కువవుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాలు కొనసాగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడుతున్నా.. ఓటర్లు ఎవరికి మొగ్గు చూపిస్తారంటూ తెగ హైరానా పడుతున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీలో గుబులు ఓ రేంజ్లో పెరిగిపోతోంది.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బరిలో దిగినా కూడా సీఎం కేసీఆర్ బరిలోకి దిగిన కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల వైపే అందరి చూపూ పడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు కామారెడ్డిలో అటు గజ్వేల్ రెండు నియోజకవర్గాల్లోనూ నామినేషన్ వేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గట్టి పోటీ ఇస్తూ ఉండగా.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టి పోటీనే ఇస్తున్నారు. గజ్వేల్లో ఇప్పటికే రెండుసార్లు విజయాన్ని సాధించిన కేసీఆర్.. మరోసారి కూడా తాను అక్కడ గెలిచి అధికారంలోకి వస్తాననే ధీమాతోనే ఉన్నారు.
అలాగే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం గట్టిగానే జరుగుతుంది కాబట్టి.. అక్కడ బీజేపీకి ఓట్లు పడినా, బీఆర్ఎస్కు ఓట్లు పడినా ఒకటే అన్న నమ్మకం వచ్చేసింది. దీంతో బీజేపీ మద్దతుదారులు కూడా కేసీఆర్ వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
దీంతో ఇప్పుడు తెలంగాణ చూపు మొత్తం కామారెడ్డి నియోజకవర్గం పైనే పడింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అధికార పార్టీతో పాటు, కాంగ్రెస్ పార్టీ కూడా తమ గెలుపును ప్రెస్టేజ్ ఇష్యూగానే తీసుకుంది. దీంతో ఇక్కడ కేసీఆర్ ఓడిపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పెద్ద విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నట్లే అవుతుంది. పైగా ఇది చరిత్రలో నిలిచిపోయే విజయంగా నమోదు అవుతుంది.
కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, రాజకీయవిశ్లేషకులు, తెలంగాణ వాసులు కూడా ఈ నియోజకవర్గ పైనే ఎక్కువగా దృష్టి సారించారు. దీంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం కామారెడ్డివైపే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ జోరుగా ప్రచారాన్ని సాగిస్తుండగా.. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవిత కామారెడ్డిలో ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు.
ఈనెల 24న హరీష్ రావు జుక్కల్లో ఎన్నికల సభ పెట్టబోతున్నారు.ఆ తర్వాత రెండు రోజులు పాటు మంత్రి కేటీఆర్ రోడ్ షో చేస్తూ ప్రచారం చేయబోతున్నారు. వీరితో పాటు ఈ నియోజకవర్గం పైనే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు.
కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలే కాకుండా.. జుక్కల్లో ఈనెల 24న ఏర్పాటు చేయబోతున్న భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడబోతున్నారు. అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్,రేవంత్ రెడ్డిలు కూడా జుక్కల్లో రోడ్ షో చేయబోతున్నారు. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తుంటే.. బీజేపీ కూడా తగ్గేదేలే అన్నట్లు ప్రచారం జోరును పెంచేస్తున్నారు. అదే నవంబర్ 24న ఈటల రాజేందర్ కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇలా మూడు పార్టీలలో పెద్దల నుంచి కార్యకర్తల వరకూ అందరూ కామారెడ్డి నియోజకవర్గం పైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో.. ప్రజలు కూడా ఇదే నియోజకవర్గంపై ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో కామారెడ్డిలో ఎవరు గెలుస్తారా అంటూ ఉత్కంఠ అందరిలో మొదలయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE