తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈరోజు (నవంబర్ 12, శనివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రామగుండంలో జరిగే సభ నుంచి రాష్ట్రానికి సంబంధించిన రూ.9500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కాగా తెలంగాణలో ప్రధాని పర్యటనకు ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దూరంగా ఉండనున్నారు.
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్ పోరాడుతున్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలో ప్రధాని మోదీ తాజా కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు, సభకు ఆహ్వానం విషయంలో అసంతృప్తితోనే సీఎం ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చివరిగా 2021, సెప్టెంబర్ లో భేటీ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మే, జూలై నెలల్లో ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాల దృష్ట్యా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పటికీ, ప్రధానికి స్వాగతం పలకడం, ఆ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగానే ఉన్నారు. అయితే తాజాగా ప్రధాని మోదీ చేపట్టే పర్యటన అధికార పర్యటన అయినప్పటికీ, పలు కారణాల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఈసారి కూడా పాల్గొనడడం లేదు.
కాగా గురువారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. అలాగే సాయంత్రం ఢిల్లీకి వెళ్లే సమయంలో కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రధానికి వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఉన్నతాధికారులు, బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE