ఎన్నికల సమీపిస్తున్న వేళ మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు గోడ దూకే రాజకీయ నేతలు. టికెట్ రాకో.. ఆశించిన పదవి రాకో.. ప్రాధాన్యం లేదంటూనో ఉన్న పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. పక్క పార్టీల వైపు చూస్తుంటారు. అలాంటి వారిలోకొందరికి జాక్ పాట్ లు కూడా తగులుతాయి. కీలకమైన పదవో.. గెలిచే సీటు వేరే పార్టీలో లేదా సొంత పార్టీలోనూ దొరికే అవకాశాలు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేందుకు బలంగా ఉన్నవారిని తమ వైపు లాక్కోవడమో, ఎక్కువమంది తమవైపు వస్తున్నారని సంకేతాలందించేందుకో వీలైనంత మంది వైరి పార్టీల వారిని చేర్చుకోవడం పార్టీలకు అలవాటైన పనే.. అందుకే ఇలాంటి జంపింగ్ జపాంగ్ లు ఎన్నికల సమయంలో ఎక్కువగా కనిపిస్తుంటారు.
ఎక్కువమంది పోటీదారులు, సమర్థులు ఉన్నప్పుడు అందరికీ టిక్కెట్ ఇవ్వడం ఏపార్టీకీ సాధ్యం కాదు. అలాగే కొందరిని కేవలం పనుల కోసం మాత్రమే వినియోగించుకునే పార్టీలూ ఉన్నాయి. అలాంటి తరుణంలో ఆయా పార్టీలకున్న అవసరాలు.. కొందరు నేతలకు పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. అది స్వపక్షం అయినా కావచ్చు, విపక్షం అయినా కావచ్చు.అంతమాత్రాన ఫలానా పార్టీయే మంచిదనో, ఫలానా వ్యక్తే సమర్ధుడనో సింగిల్ ఫార్ములాను ఖరారు చేయలేం. ఎన్నికల వేళ పార్టీ మార్పులను సగౌరవంగా పరిగణించడం అరుదు. జంపింగ్ జపాంగ్ లనో, ఆయారామ్ గయారామ్లనో మాత్రమే అంటారు తప్ప కడిగిన ముత్యమనరు. అక్కడ సీటు దొరక్కే ఇక్కడకొచ్చారనడమూ సాధారణం. అంతమాత్రాన వారు సామర్ధ్యం లేనివారు కారు. పార్టీ మారి గెలిచాక మంత్రులైన వారూ ఉన్నారు. గెలవలేక ఎన్నికలు ముగియగానే మళ్లీ సొంతగూటికి వెళ్లినవాళ్లు తక్కువేం లేరు. ఆశించిన పార్టీ టిక్కెట్ ఇవ్వని పక్షంలో సొంతంగానే గెలిచి సత్తా చాటిన వారూ కనిపిస్తారు.
ప్రత్యేకంగా తెలంగాణలో ఇలాంటి వారెందరెందరో. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యే, మంత్రిగానే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీ అధ్యక్షునిగా కూడా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ ఆదరించింది. స్వయానా మంత్రి కేటీఆర్ పొన్నాలను ఆహ్వానించడం సీనియారిటీకి, పరిణితికి ఇచ్చిన సమున్నత గౌరవంగా భావిస్తున్నారు. పదవి లేకపోయినా, టిక్కెట్టు రాకపోయినా అలాంటి ఆదరణ ఎవరైనా కోరుకుంటారు. జనగామలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్లో చేరారు. మరోవైపు, నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. 20వ తేదీన రాహుల్గాంధీ సమక్షంలో నిజామాబాద్లో కాగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. అది ఆమె వ్యక్తిగతం. రెండు అంశాల్లోనూ వ్యత్యాసాన్ని గుర్తించవచ్చు. అదే జిల్లాకు చెందిన బోధన్ మునిసిపల్ చైర్మన్ తూము పద్మావతి, కౌన్సిలర్లు శరత్రెడ్డి, శ్రీకాంత్గౌడ్, పి.సత్యనారాయణ, మీర్ నజీర్అలీ, ఇమ్రాన్, జావీద్, అబ్దుల్లా, లత, రవిచంద్ర ,సర్పంచులు అంజమ్మ, రాంగోపాల్రెడ్డి, తదితరులు బీజేపీనుంచి కాంగ్రెస్లోకి చేరారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అధికార పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఎల్బీనగర్ ఇన్ఛార్జి ముద్దగాని రామ్మోహన్గౌడ్ కాంగ్రెస్లోకి జంపయ్యారు. అదే క్రమంలో పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ టిక్కెట్ నాశించిన ఎంఎన్ఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు , చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. బీఆర్ఎస్పై అభిమానంగానే ఉన్న ఆయన ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా తన రాజకీయ భవిష్యత్ కోసం ఇండిపెండెంట్గానే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రెండు డివిజన్లకు కార్పొరేటర్లుగా ఉన్న జగదీ«శ్వర్గౌడ్, పూజిత దంపతులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు. పార్టీలోని పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయనకు తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చేందుకే ఇటీవల జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఫ్లోర్లీడర్గా నియమించారు. అయినప్పటికీ, కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. అలా పార్టీ మారి వచ్చి ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా చెలామణి అయిన వారు చాలా మందే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అలాంటి ఇంకెందరు తెరపైకి వస్తారో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE