దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ యూజీ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం రాత్రి ఫలితాలను ప్రకటించింది. ఇక జులై 17న నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, అందులో 9,93,069 మంది అర్హత సాధించారు. కాగా 56.27శాతం నమోదైనట్లు ఎన్టీఏ తెలిపింది. రాజస్థాన్కు చెందిన తనిష్క మొదటి ర్యాంక్ సాధించగా, ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంక్ సాధించాడు. అలాగే కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ, రుచా పవోషీ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. కాగా ఈ పరీక్షకు తెలంగాణ నుంచి 59,296 మంది పరీక్షకు హాజరవగా, 35,148 మంది (59.27%) మంది అర్హత సాధించారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 65,305 మంది పరీక్షకు హాజరవగా, 40,344 మంది (61.77%) అర్హత సాధించారు.
ఇక నీట్ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మొదటి 50 ర్యాంకుల్లో 8 మంది తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు 720 మార్కులకు గాను 711 మార్కులతో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. 710 మార్కులతో ఏపీకి చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గుల్లా హర్షవర్ధన్ నాయుడు 25వ ర్యాంకు సాధించారు. అలాగే తెలంగాణకు చెందిన చప్పిడి లక్ష్మీ చరిత 705 మార్కులతో 37వ ర్యాంకు, కే జీవన్ కుమార్ రెడ్డి 705 మార్కులతో 41 ర్యాంకు, వీ అతిథి 700 మార్కులతో 50వ ర్యాంకు, సీహెచ్ యశస్విని 700 మార్కులతో ఆలిండియా 52వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. అలాగే దివ్యాంగుల కోటాలో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్సాయి 661 మార్కులు సాధించి దేశంలోనే తొలి ర్యాంకులో నిలవడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ