తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ‘వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు’ ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలో ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెట్టిన ఎనిమిదవ వందే భారత్ ఎక్స్ప్రెస్ గా నిలిచింది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో మరియు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మరియు సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగనుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోని 10వ నంబర్ ప్లాట్ ఫామ్ పై జరిగిన ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ పండుగ శుభ వాతావరణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ఇరు రాష్ట్రాల యొక్క భాగస్వామ్య వారసత్వాన్ని అనుసంధానించే గొప్ప కానుక లభిస్తోందని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. వందేభారత్ ఎక్స్ప్రెస్ యాత్రికులు మరియు పర్యాటకులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మరియు సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని ప్రధాని తెలియజేశారు. వందే భారత్ అనేది నవ భారత సామర్థ్యానికి మరియు సంకల్పానికి చిహ్నం అని, వేగవంతమైన అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్న భారతదేశానికి ఇది చిహ్నమని ప్రధాని పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లకు సంబంధించి జరుగుతున్న పనుల వేగాన్ని కూడా ప్రధాని నొక్కి చెప్పారు. ఈ ఏడాది 15 రోజుల్లోనే రెండో వందేభారత్ అమలులోకి వస్తుందని, ఇది క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పుల వేగాన్ని సూచిస్తోందన్నారు. కనెక్టివిటీ మరియు స్పీడ్ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని మరియు ‘సబ్కా వికాస్’తో వాటి అనుబంధాన్ని ప్రధాని గుర్తుచేశారు. గతి (వేగం) ఉన్నచోట ప్రగతి (ప్రగతి) ఉంటుందని, ఎప్పుడైతే పురోగతి సాధిస్తుందో శ్రేయస్సు ఖాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క సాధారణ సేవలు నేటి నుంచి (జనవరి 16) ప్రారంభం కానుండగా, ఈ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే నడవనుంది. ఆదివారం అందుబాటులో ఉండదని రైల్వే వర్గాలు తెలిపాయి. హైదరాబాద్-విశాఖపట్నం నగరాల మధ్య ప్రస్తుతం సాధారణ రైలు ప్రయాణ సమయం దాదాపు 12 గంటలు కాగా, ఈ రైలు వలన ఈ సమయం 3.20 గంటలు తగ్గి, 8.40 గంటల్లో గమ్యం చేరుస్తుంది. విశాఖ నుంచే బయలుదేరే రైలుకు 20833 నంబరు కేటాయించగా, సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలుకు 20834 నంబరు ఇచ్చారు. ఇక ఇందులో మొత్తం 16 కోచ్లు ఉండగా, 14 ఏసీ చైర్ కార్స్, రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ ఉన్నాయి.
‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయాలు:
విశాఖపట్నం-సికింద్రాబాద్ (20833):
- ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది.
- రాజమండ్రి – 7.55 గంటలకు
- విజయవాడ – 10.00 గంటలకు
- ఖమ్మం – 11.00 గంటలకు
- వరంగల్ – 12.05 గంటలకు
- సికింద్రాబాద్ – మధ్యాహ్నం 2.15 గంటలకు
సికింద్రాబాద్-విశాఖపట్నం (20834)
- సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభమవుతుంది.
- వరంగల్ – సాయంత్రం 4.35 గంటలకు
- ఖమ్మం – 5.45 గంటలకు
- విజయవాడ – రాత్రి 7.00 గంటలకు
- రాజమండ్రి – రాత్రి 8.58 గంటలకు
- విశాఖపట్నం – రాత్రి 11.30 గంటలకు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE