తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటుగా మొత్తం 15 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 17, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశంలో లాక్డౌన్ ల దశ ముగిసి, అన్ లాక్ ల దశ ప్రారంభమయిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, “దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారేమోననే ప్రచారం జరుగుతున్నది. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్డౌన్ ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. ప్రధాన మంత్రి అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా లాక్డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోరు అని నేను చెబుతున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి” అని కోరారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. “దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలని” ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. “కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది. కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదు అవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది. తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా పనిచేస్తున్నాం. కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం నాకున్నది. మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నది. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెల్లడానికి సిద్ధమవుతున్నారు. వారికి అవకాశం కల్పించాలి. దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికి పోయైనా పనిచేసుకునే అవకాశం ఉండాలి. బీహార్ నుంచి హమాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారు” అని సీఎం కేసీఆర్ చెప్పారు.
బీహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి సరదాగా స్పందించారు. “నితీష్ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సిఎస్ కూడా మీ బీహార్ వారే. దయచేసి పంపించండి” అని కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu