ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శామీర్పేట సమీపంలోని జినోమ్ వ్యాలీలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ ను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. శనివారం నాడు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ సంస్థ వద్దకు చేరుకొని ‘కొవాగ్జిన్’ పేరుతో తయారయ్యే కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని మోదీ పరిశీలించనున్నారు.
అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. ముందుగా సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారని పీఎంవోకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ సమాచారం ఇచ్చారు. కాగా ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ సీఎస్ సోమేశ్ కుమార్కు తెలిపినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పీఎంవో అనుమతి ఇచ్చిన విధంగా హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మొహంతి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ