మహారాష్ట్ర భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన కిసాన్ సమితి విభాగం ఆధ్వర్యంలో నాందేడ్ జిల్లా కంధార్ నియోజకవర్గం పరిధిలోని లోహా పట్టణంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గత నెల 5న నాందేడ్లో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి సమావేశం అనంతరం మహారాష్ట్రలో మళ్ళీ బహిరంగ సభ జరపడం ఇదే కావడం గమనార్హం. దీంతో నేటి సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ విజయవంతం చేయడానికి సకల సన్నాహాలు పూర్తి చేసింది. ఈ క్రమంలో బైల్ బజార్లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ముస్తాబయింది. బహిరంగ సభకు దారితీసే అన్ని ప్రధాన రహదారుల్లో గులాబీ తోరణాలు, భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఇక సభ నిర్వహణ ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్రావు కదం, కంధార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
కాగా మరోవైపు మహారాష్ట్ర కిసాన్ సమితి.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ తదితర సంక్షేమ పథకాలతో రూపొందించిన వీడియోలను బహిరంగసభ జరిగే కంధార్-లోహా సమీప ప్రాంతాలైన నాందేడ్, పూర్ణ, పాలెం, అర్దర్పూర్, అహ్మద్పూర్ పరిసర ప్రాంతాల్లో 20 ప్రచార రథాల ద్వారా తెలంగాణ మాడల్పై ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పిలుపునిచ్చిన ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదాన్ని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేటి సభలో కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆయనకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE