పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. శుక్రవారం ఉదయం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నుంచి “చలో రాజ్ భవన్” కార్యక్రమం చేపట్టి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. కాగా ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కోవిడ్ నిబంధనలతో కేవలం 200 మందితో ధర్నా చౌక్ వద్ద సమావేశమయ్యేందుకే వారికీ అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇందిరాపార్క్ కు వెళ్లేందుకు సిద్దమవుతున్న పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
చలో రాజ్భవన్ కార్యక్రమంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తామని చెప్పారు. ముందస్తుగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.40పెట్రోలు రూ.105 కి ఎందుకమ్ముతున్నారని ప్రశ్నించారు. పెట్రో ఉత్పత్తులపై 60 శాతానికిపైగా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి పై భారం మోపుతున్నారని విమర్శించారు. పోలీసులు అరెస్టు చేసినా నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇక ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, దామోదర్ రెడ్డి, అంజనీ కుమార్ యాదవ్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ