జరగబోయే ఎన్నికల సమరం.. తెలంగాణ అంతటా ఒక ఎత్తు.. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ఎత్తుగా మారింది. ఇక్కడ అందరూ దిగ్గజ నాయకులే. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్లో ని ప్రముఖులు ఎన్నికల వేళ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ లో కాస్త జోష్ పెరిగింది. అయితే.. పైకి కనిపిస్తున్న జోష్ కాకుండా అంతర్గతంగా పార్టీలో సాగుతున్న రచ్చ కేడర్ ను అయోమయంలో పడేస్తోంది. మరోవైపు అధిష్ఠానం కూడా ఇప్పటి వరకూ టికెట్లు కేటాయించకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇదే అదునుగా మంత్రి, బీఆర్ ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయాల్లో పట్టుబిగిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనకు నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
బలమైన సామాజిక వర్గం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. బలమైన సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా అంతటా కేడర్ ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుడిగా చేసిన అనుభవం, రెండు పర్యాయాలు ఎమ్మెల్యే, మంత్రిగా కొనసాగుతుండడంతో జిల్లా రాజకీయాల పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో పొంగులేటి, తుమ్మల వంటి నేతలకు ధీటుగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. తాను ఖమ్మంలో గెలవడంతో పాటు జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన 2014లో పువ్వాడ తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. అలాగే.. రాజకీయాల్లో పొంగులేటి లోపాలను ఎత్తిచూపుతూ తనదైశ శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో యువత కూడా బీఆర్ ఎస్ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు.
వ్యూహాత్మక అడుగులు
వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ ఎస్ నాటి టీఆర్ ఎస్ 2014 నుంచి ఆశాజనక ఫలితాలను సాధించలేదు. కాకపోతే కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష అక్కడ బాగానే పని చేసింది. దాంతో అక్కడ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. దాంతో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరేసి, ముగ్గురేసి ఎమ్మెల్యే క్యాండిడేట్లు తయారయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సహకారంతో పువ్వాడ జిల్లాలో పట్టు బిగిస్తూ వస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధిక స్థానాలు గెలుచుకోవాలనే కసితో పని చేస్తున్నారు. విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వామపక్షాలకింకా ఎంతో కొంత బలముంది. పార్టీ పరంగా వారితో సంబంధం లేనప్పటికీ.. వామపక్ష కుటుంబం భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిగా గుర్తింపు ఉన్న పువ్వాడ కు కొందరు వ్యక్తిగతం సపోర్టు నిలుస్తుండడం తాజా రాజకీయాల్లో చెప్పుకోదగ్గ అంశం.
రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా..
ఖమ్మంలో మరో పెద్ద చిక్కొచ్చి పడింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పాలేరు టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చాకే తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు టికెట్ కోరుతున్నారు. ముందు నుంచి పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు కానీ హటాత్తుగా పొంగులేటి తనకు పాలేరు టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. అటు తుమ్మల కూడా పాలేరు టికెట్ కోసం తగ్గేదే లే అంటున్నారట. ఈ పరిస్థితుల్లో అధిష్ఠానం కాస్త గందరగోళానికి గురైనప్పటికీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే.. సిట్టింగ్లు లేని కొన్ని స్ధానాలకు పొంగులేటి కొందరు అభ్యర్థులను సూచించగా, భట్టి విక్రమార్క వేరే అభ్యర్థులను సూచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అభ్యర్థులనే ఇంకా ఎంపిక చేయలేక అది సతమతమవుతోంది. ఈ సమీకరణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పువ్వాడ ఖమ్మంలో విపక్షాల దిమ్మ తిరిగేలా బీఆర్ ఎస్కు అనుకూల రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY