కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా 30 రోజులు. ఒక నెలలో ప్రభుత్వ పనితీరును పూర్తిగా అంచనా వేయలేం. కానీ.. ఓ అవగాహనకు అయితే రావొచ్చు. చేసిన పనులను, ప్రకటించిన చేయబోయే పనులను పరిశీలించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందనేది చెప్పాలంటే.. నూరు శాతం ఆకట్టుకోలేక పోయినా.. 99 శాతం ప్రజలను అలరించారని చెప్పొచ్చు. రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి సంచలనం సృష్టించారు. అయితే రేవంత్ దూకుడు చూసి ఒక్కరోజు ముఖ్యమంత్రిగా హడావిడి చేస్తున్నారన్న వాళ్లూ ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే.. ఒక్కో శాఖను సమీక్షిస్తూ.. ఆయా శాఖలో చేపట్టాల్సిన మార్పులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. అంతేకాదు.. కీలక శాఖల ఉన్నతాధికారులను మార్చి భారీ సంఖ్యలో ఐఏఎస్ల బదిలీలు చేపట్టారు. రాజధాని కమిషనరేట్లకు కొత్త సీపీలను నియమించి పాలనలో కొత్త మార్క్ కు శ్రీకారం చుట్టారు.
ప్రతిపక్షం 420 అన్నా.. గిట్టని వాళ్లు రేవంత్ ను విమర్శిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓ లక్ష్యంపై స్పష్టతతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య సమన్వయమూ కనిపిస్తోంఇ. కేవలం నెలలోపునే వారు చేసిన పనుల కంటే మిన్నగా మరే ప్రభుత్వమైనా చేయలేదనే మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకొచ్చిన కొన్ని మార్పులు ప్రజలను ఆకట్టుకున్నాయనే చెప్పొచ్చు. వాటిలో ఒకటి అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ప్రారంభించిన ప్రజాదర్భార్. ఆ తర్వాత దానికి ప్రజావాణిగా మార్చి ప్రతీ మంగళ, శుక్రవారాలు కొనసాగిస్తున్నారు. అదే 24 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత సదుపాయానికి సంబంధించిన జీవో జారీ చేసిన ప్రభుత్వం మర్నాటి నుంచే అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఆరుకోట్లకు పైగా మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్సల ఖర్చు పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టారు. గ్రూప్ పరీక్షల నిర్వహణ లోపాల్లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు,నిధుల కోసం కేంద్ర మంత్రుల్ని సంప్రదించారు. ప్రజావాణి కోసం జిల్లాల నుంచి ప్రజలు రాజధాని హైదరాబాద్ దాకా రానవసరం లేకుండా ఎక్కడికక్కడే ఆ కార్యక్రమ నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. అభయహస్తం ద్వారా ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. వాటితోపాటు రేషన్కార్డులు ఇతరత్రా అవసరాల దరఖాస్తులూ స్వీకరిస్తున్నారు.
నెలరోజుల్లోగా ఆరు గ్యారంటీల అమలు దరఖాస్తుల స్వీకరణ ముగించాలనే తలంపుతోనే ఈ కార్యక్రమం షెడ్యూలు రూపొందించారు. ఇలా ఏ ఒక్క రోజూ వృథా చేయకుండా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పనితీరును చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ అంటేనే గొడవలు, కొట్లాటలతోనే సరిపోతుందని, మంత్రి వర్గం ఏర్పాటు కాగానే పదవులు రాని అసమ్మతులు, అసంతృప్తులు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని భావించిన పలువురి అంచనాలకు భిన్నంగా ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యవహరించింది. రోజుకు 18 గంటలు ప్రభుత్వం పని చేస్తూ, అధికారులతోనూ పని చేయిస్తోంది. అందుకే కేవలం నెల రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టగలిగింది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించడమే కాకుండా, ప్రతి శాఖనూ, ప్రతి సమస్యనూ వంద రోజుల్లోనే మార్చేందుకు, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ 30 రోజుల పాలన సక్సెస్ఫుల్గానే సాగింది. అలానే సాగాలని కోరుకుందాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE