తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో రోజైన డిసెంబర్ 30, గురువారం నాడు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. మూడో రోజు మొత్తం 10,51,384 మంది రైతుల ఖాతాలలో రూ.1302.6 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. మూడు రోజులలో మొత్తం 45,95,167 మంది రైతుల ఖాతాలలో 3,102.04 కోట్లు జమ చేశామని, ఇప్పటివరకు 62,04,085 ఎకరాలకు రైతుబంధు నిధులు పంపిణీ జరిగిందన్నారు.
సాగుకు సహకారమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో సాగుకు దూరమైన రైతాంగాన్ని వ్యవసాయంలో నిమగ్నం చేశామని, దేశంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయరంగానికి సీఎం కేసీఆర్ ఊపిరి పోశారన్నారు. సీఎం ముందుచూపుతో వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభించి రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటుతో పాటు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం మూలంగా రైతులు సాగుపై దృష్టి సారించారని, దాని ఫలితమే తెలంగాణలో ఊహించని విధంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల పథకాలు చూసి కేంద్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు వ్యవసాయ అనుకూల విధానాలు, పథకాల మీద దృష్టి సారిస్తున్నాయన్నారు. మట్టిని నమ్ముకుని ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత అగ్రభాగంలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ