బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం హైదరాబాద్లో ప్రారంభమైంది. గురువారం నాగోల్లోని శుభం కన్వెన్షన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బూర నర్సయ్య గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్, ఆలే భాస్కర్ తదితరుల నేతలు పాల్గొన్నారు. అలాగే ఈ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో ఓబీసీలు, బీజేపీ క్యాడర్ హాజరయ్యారు. అంతకుముందు కొత్తపేట నుండి నాగోల్ వరకు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఓబీసీ సమ్మేళనం చేపట్టింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్లు దశాబ్దాల పాటు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని, వెనుకబడిన వర్గాలకు చెందిన తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అవకాశం ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ క్యాబినెట్లో ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులున్నారని.. ఆయన కుటుంబంలో మాత్రం నలుగురికి మంత్రి పదవులు వచ్చాయని విమర్శించారు.
రాష్ట్రంలో బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వటం కాదని, దళితబంధు మాదిరిగానే బీసీబంధు ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గొప్పగా చెప్పుకుంటున్న దళితబంధులో 30 శాతం కమిషన్ను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రూ.1,600 కోట్లతో సచివాలయం కట్టిన సీఎం కేసీఆర్.. బీసీల ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించటంలేదు? అని ప్రశ్నించిన సంజయ్ త్వరలో హైదరాబాద్ వేదికగా బీజేపీ ఆధ్వర్యంలో లక్షల మందితో బీసీ శంఖారావ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ మేథావులైన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటివారిని సీఎం కేసీఆర్ అవమానించారని, ఆయన అధికారంలోకి వచ్చాకే బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తగినంత బలం ఉన్నా మజ్లిస్ వంటి పార్టీలతో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీ పాలనలో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతోందని ఆరోపించారు. తెలంగాణలో రామరాజ్యం రావాలంటే మరో ఐదు నెలలు ఓపిక పట్టాలని, ప్రజలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE