తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జూన్ 15 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజులలో జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. రెండు రోజులలో మొత్తం రూ.1,669.42 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాలలో జమచేసినట్టు తెలిపారు. రెండవ రోజైన బుధవారం నాడు 15.07 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1152.46 కోట్లు జమచేశామన్నారు. ఇక మూడవ రోజు(గురువారం) 10.40 లక్షల మంది రైతులకు రూ.1272.85 కోట్లు అందజేయనున్నట్టు తెలిపారు.
మొదటి మూడు రోజులలోనే రాష్ట్రంలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు పంపిణీ చేసినట్టు అవుతుందని మంత్రి పేర్కొన్నారు. మూడో రోజున నల్గొండ జిల్లాలో అత్యధికంగా 79,727 మంది రైతులకు రూ.98.29 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3701 మంది రైతులకు రూ.4.45 కోట్లు పంపిణీ జరుగుతుందని, ఈ నెల 25 వరకు రైతులకు రైతుబంధు నిధుల పంపిణీని పూర్తి చేస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో పత్తి, కంది అధికంగా సాగు చేయడంతో పాటుగా రైతులు పప్పు దినుసులు, నూనెగింజల పంటల సాగును కూడా పెంచాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతాంగం దృష్టి సారించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ