రాష్ట్రంలో రేపటి నుంచి (జూన్ 15) రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం నిధులు జమఅవుతాయని, అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సీజన్ రైతుబంధు కోసం మొత్తం 63.25 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిపారు. ఈ మేరకు సీసీఎల్ఎ తుదిజాబితా విడుదల చేసి వ్యవసాయ శాఖకు అందజేసిందన్నారు. 63 లక్షల 25 వేల 695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల ఎకరాలకు రూ.7508.78 కోట్ల నిధులు అవసరమవుతాయని చెప్పారు. గత యాసంగి సీజన్ కన్నా 2.81 లక్షల మంది రైతులు పెరగగా, నూతనంగా 66 వేల 311 ఎకరాలకు కూడా రైతుబంధు అమలు కానుందని చెప్పారు.
ఇక మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని చెప్పారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్ లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దని, ఏమైన అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని అన్నారు.
“అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 12.18 లక్షల ఎకరాలకు గానూ 4,72,983 మంది అర్హులైన రైతులుకు రూ.608.81 కోట్లు చెల్లించడం జరుగుతుంది. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 77 వేల ఎకరాలకు 39,762 మంది అర్హులైన రైతులుకు రూ.38.39 కోట్లు అందించనున్నాం. ఏడు జిల్లాలకు రూ.300 కోట్ల నుండి రూ.400 కోట్లు, మరో 11 జిల్లాలకు రూ.200 నుండి రూ.300 కోట్లు, అలాగే 10 జిల్లాలకు రూ.100 నుండి రూ.200 కోట్లు చెల్లింపులు జరగనున్నాయి. వరంగల్ అర్బన్ , ములుగు, మేడ్చల్ జిల్లాలకు రూ.100 కోట్ల లోపు నిధులు అవసరం కానున్నాయి. ఈ నెల 15 నుండి 25 వరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమచేయబడతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరసగా ఏడోసారి రైతుబంధు నిధులు విజయవంతంగా రైతుల ఖాతాలలోకి జమచేస్తున్నాం. గత ఏడాది నుండి కరోనా విపత్తులోనూ కూడా వరసగా మూడోసారి రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నాం. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గాను రూ.14,656.02 కోట్లు, ఈఏడాది వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్ లో రూ.14,800 కోట్లు కేటాయించి ఆమోదం తెలిపాము” అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ