మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే గురువారం ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఛత్రపతి శంభాజీ రాజేను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో ఘనంగా ఆహ్వానం పలికారు. మధ్యాహ్నం భోజనంతో వారికి ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం సీఎంతో సుధీర్ఘంగా పలు అంశాలమీద లోతైన చర్చలు జరిగాయి. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశానికే ఆదర్శంగా, అనతికాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఆయన ఆరా తీసారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా అన్నివర్గాల ప్రజలకు ఇంత గొప్పగా సంక్షేమాన్ని అందిచడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ విధి విధానాలను తెలుసుకోవడానికి ఛత్రపతి శంభాజీ రాజే ఆసక్తిని కనబరిచారు. అందుకు సంబంధించిన అంశాలను సీఎంను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఛత్రపతి శంభాజీ రాజే తన ఆకాంక్షను వెల్లడించారు. అద్భుతమైన తెలంగాణ ప్రగతి నమూనా ఇక్కడికే పరిమితం కాకుండా మహారాష్ట్ర సహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు దేశ వ్యాప్తంగా విస్తరించాల్సి వుందని రాజే అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంశాలతో పాటు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇరువురి నడుమ సుధీర్ఘ చర్చ సాగింది. దేశ ప్రజల అభ్యున్నతి కోసం, దేశ సమగ్రత కోసం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వినూత్న ఎజెండా ప్రజలముందుకు రావాల్సిన అవసరమున్నదని వారిరువురూ అభిప్రాయపడ్డారు.
అవసరమైతే సందర్భాన్ని బట్టి మళ్లీ ఒకసారి కలుసుకుని అన్ని అంశాలపై చర్చిద్దామని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శంభాజీ రాజే పూర్వీకులు శివాజీ మహారాజ్ నుంచి సాహూ మహారాజ్ దాకా ఈ దేశానికి వారందించిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందంచిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వారి స్ఫూర్తితోనే, కుల, మత వివక్షకు తావు లేకుండా తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా జరిగిన చర్చలో సీఎం స్పష్టం చేశారు. అనంతరం ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ కు ఛత్రపతి శంభాజీ రాజే అందించారు. ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఛత్రపతి శంభాజీ రాజేతో పాటు వచ్చిన ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE