తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. గురువారం రాత్రి తీవ్ర గుండె పోటు రావడంతో, మల్కాజ్ గిరిలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. తెలంగాణ ఉద్యమ సమయంలో కే.ఆర్.ఆమోస్ కీలక పాత్ర పోషించారు. టిఎన్జీవో అధ్యక్షుడిగా కూడ సేవలు అందించారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమోస్ సర్విస్ నుంచి డిస్మిస్ కాబడ్డారు. ఉద్యమం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయిన తోలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. తరువాత రాజకీయాల్లోకి చేరిన ఆయన తొలుతగా కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2005 నుంచి 2007 వరకు పౌరసరఫరాల శాఖ చైర్మన్గా వ్యవహరించారు. అదేవిధంగా 2007 నుంచి 2016 వరకు రెండుసార్లు ఎమ్మెల్సీగా సేవలందించారు. ఇక 2016 లో ఆమోస్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్. ఆమోస్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమోస్ ప్రదర్శించిన స్ఫూర్తిని, త్యాగనిరతిని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రులు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి తో సహా పలు పార్టీల నేతలు ఆమోస్ మృతికి సంతాపం తెలియజేసారు.