కొమురంభీం జిల్లా జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏంటి అంటే.. ఈ నియోజకవర్గం 1962 నుంచి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థిని రెండేసి సార్లు గెలిపించిన క్రెడిట్ను సొంతం చేసుకుంది. 1962 నుంచి 1978 వరకు వరుసగా జరిగిన ఎన్నికలలో నాలుగు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే.. 1983, 1985, 1999 లలో టీడీపీని విజయం వరించింది. 2004 ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్కు గెలిచింది.
సిర్పూర్ నియోజకవర్గం మరో 6 శాసనసభ నియోజకవర్గాలతో కలిపి.. ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సిర్పూర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. తెలంగాణలో మొదటి నంబరు శాసనసభ నియోజకవర్గ స్థానం ఈ నియోజకవర్గానికే లభించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గానికి తొలి నంబరు ఉండగా.. 2008 సంవత్సరానికి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆ స్థానం సిర్పూరుకు లభించింది.
తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన సిర్పూర్ స్థానంపై.. ఈ ఎన్నికల సమయంలో అందరి చూపూ పడింది. ఎందుకంటే తన ఐఏఎస్ జాబ్కే రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ అధికారి ప్రవీణ్ కుమార్ ఇక్కడే పోటీ పడుతున్నారు. రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగిన ఆయన..బహుజనవాదంతో బరిలోకి దిగారు. కారణం ఏదైనా కానీ..తన సొంత జిల్లాను కూడా కాదని సిర్పూరులో పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే సిర్పూరు స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఎవరికి వారు తమ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు అక్కడ మంచి పేరే ఉంది. నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు స్వచ్చంద సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తూ మొదటి నుంచీ కూడా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సారి ఎన్ని కల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నారు. అయితే బహుజన వాదాన్ని తెరపైకి తెస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగడంతో ఇక్కడ ఎన్నికల సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తన సొంత జిల్లాను కాదని, తెలంగాణలో మరో చివరన ఉన్న సిర్పూర్కు వచ్చి మరీ పోటీ చేస్తున్నారు. దీనికి కారణం ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు ఎక్కువగా ఉండటమే.పైగా అంతకుముందు సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ గెలిచిన చరిత్ర ఉండటం కూడా ఒక కారణం. అయితే ప్రవీణ్ కుమార్ రాకతో.. ముందునుంచీ ముక్కోణపు పోటీ ఉంటుందనుకున్న పొలిటికల్ సీన్ కాస్తా తిరగబడి చతుర్ముఖ పోటీగా మారిపోయింది.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ తొమ్మిదిన్నరేళ్లలో తాను, తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు తాను వ్యక్తిగతంగా అమలు చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ పాల్వాయి హరీశాబాబు.. ఈసారి పార్టీ మారి భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగారు. అయితే పార్టీ బలం కంటే కూడా తన తల్లిదండ్రులైన పాల్వాయి రాజ్యలక్ష్మి, పురుషోత్తంరావుకు ఉన్న పేరు ప్రతిష్ఠలపైనే ఆయన ఎక్కువగా ఆధారపడ్డారు.
ఇక 2014 నుంచి వరుసగా ఓడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన రావి శ్రీనివాస్ ఈసారి కాస్త పట్టుదలతోనే ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తాయని..సిర్పూరు ఓటర్లు తనను గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు.సిర్పూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,22,973 మంది ఉండగా.. వారిలో మహిళా ఓటర్లు 1,11,039,పురుషులు 1,11,924,ఇతరులు 10మంది ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE