పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో బిగ్ ఫైట్ కొనసాగుతుండటంతో.. అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే పడింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ క్లీన్ స్పీస్ చేసేసినా.. మంథనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మరోసారి బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ప్రచారాలలో ఒక్కోసారి శృతిమించడంతో కొన్నిసార్లు ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఈ రెండు పార్టీలు ఒకరిమీద ఒకరు ఫోకస్ పెంచుకోవడంతో సందిట్లో సడేమియాలా బీజేపీ మెల్లగా పుంజుకుంది.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ అభ్యర్ధిగా పుట్టా మధు, బీజేపీ అభ్యర్థిగా సునీల్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. కానీ మంథనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరుఫున శ్రీధర్ బాబు ఒకరే గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా రెండు పార్టీల నుంచి గతంలో పోటీ చేసిన ఈ ఇద్దరు నేతలే మరోసారి బరిలోకి దిగుతున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంథనిలో అభివృద్ధి జరుగకుండా, ప్రభుత్వం అడ్డుకుందని విమర్శలు చేస్తున్న శ్రీధర్ బాబు.. ప్రభుత్వ వైఫల్యాలను వివరించే ప్రయత్నం చేస్తూ ప్రజలలోకి దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ సర్కార్పై తీవ్రమైన విమర్శలు చేస్తూ.. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాలు చాలామందికి అందలేదంటూ చెబుతున్నారు.తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని మంథని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు శ్రీధర్ బాబు.
కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు కీలక నేత కావడంతో.. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పర్యటించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… శ్రీధర్ బాబు సీఎం అవుతారనే ప్రచారం సాగుతుంది.మరోవైపు ఈమధ్య కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మద్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఈ ఇద్దరు నేతలు విమర్శలు, ప్రతి విమర్శలలో పదును పెంచారు. అయితే అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మళ్లీ తానే విజయం సాధిస్తానని శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అలాగే అటు ఈ ఐదేళ్లలో మంథని అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందని ..దానికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకరాలేకపోయారని విమర్శిస్తూనే తాము కాంగ్రెస్పై దాడులు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మధు మండిపడ్డారు. ఈసారి మాత్రం మంథని ప్రజలు తననే కచ్చితంగా గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ గ్రామానికి వెళ్తూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లో మమేకం అవుతున్నారు.
మెయిన్ టార్గెట్గా బీఆర్ఎస్, కాంగ్రెస్ను భావిస్తుండగా..కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్నే తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ ప్రచారంలో అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఈ రెండు వర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగిస్తూ ప్రచారాలు కొనసాగిస్తూ ఉంటే.. మెల్లమెల్లగా ఈ రెండు శ్రేణుల మధ్య బీజేపీ పుంజుకుంటుంది. చాపకింద నీరులా వేగంగా మూడో పోటీదారుగా బలంగా మారుతోంది. దీంతో పాత కాపుల మధ్య పోరులో వచ్చిన సునీల్ రెడ్డి కూడా తన ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో మంథని నియోజకవర్గ ప్రజలు చూశారని, తనకు ఒక్కసారి అవకాశమివ్వాలని బీజేపీ అభ్యర్థి సునీల్ రెడ్డి కోరుతున్నారు.. ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా మంథని గురించి పెట్టించుకోలేదని ఆయన ఆరోపిస్తూ తనను గెలిపించాలని సునీల్ రెడ్డి కోరుతున్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే, ఈసారి బీజేపీ ఓటింగ్ శాతం బాగానే పెరిగే అవకాశాలు కనబడుతున్నాయని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY