రేపటి నుంచి (సెప్టెంబర్ 6, మంగళవారం) తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బాన్సువాడ నుండి టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “ఈనెల 6వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ 8వ సెషన్ 3వసమావేశాలు, శాసనమండలి 18వ సెషన్ 3వ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో లాగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలి. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ బాషలలో అందించాలి” అని అన్నారు.
“సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలి. నియోజకవర్గాలలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలి. స్థానిక శాసనసభ్యునికి ముందస్తుగా సమాచారం అందించాలి. ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకుండా రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపాలి. శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం తరపున అందించాలి. కరోనా ప్రభావం తగ్గినప్పటికి ఎవరికైనా లక్షణాలు ఉంటే నిర్ధారణ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో అసెంబ్లీ డిస్పెన్సరీలో కరోనా టెస్టింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. అవసరమైన సభ్యులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలి” అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని నివాసం నుండి టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత సమర్ధవంతమైనది. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. గతంలోని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈసారి కూడా అదేవిధంగా జరిగే విదంగా తగిన చర్యలు తీసుకోవాలి” అని సూచించారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహాచార్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏ అండ్ యూడీ) అర్వింద్ కుమార్, సెక్రటరీ (జీఏడీ)- శేషాద్రి, హెల్త్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ అనిల్ కుమార్, డీజీ ఫైర్ సర్వీస్ సంజయ్ కుమార్ జైన్, అడిషనల్ సీపీ డీఎస్ చౌహన్, జాయింట్ సీపీ ట్రాఫిక్ రంగనాథ్, డీసీపీ సెంట్రల్ జోన్ రాజేష్ చంద్రా, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY