తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మరియు పొత్తులపై టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన అనంతరం కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అంచనా వేశారు. ఇక ఏ ఒక్క పార్టీకి 60కి మించి సీట్లు రావని తేల్చి చెప్పిన ఎంపీ, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే 40-50 సీట్లు రావొచ్చని, అప్పుడు పొత్తులతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇంకా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండూ సెక్యులర్ పార్టీలని, అందుకే కేసీఆర్ తమతో కలవక తప్పదని.. అందుకే ఇటీవల ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాగా మార్చి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, బైక్ యాత్ర ప్రారంభిస్తానని, ఈలోపు అధిష్టానం నుంచి రూట్ మ్యాప్ తీసుకుంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేశారు. ఇక మాణిక్ రావ్ ఠాక్రే వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాడిలో పడిందని, ఆయన సీనియర్ నేత కావడంతో అందరినీ కలుపుకుని వెళ్తున్నారని తెలిపారు. అలాగే అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను పొగడడం వెనుక కేసీఆర్ ఎత్తుగడ ఉందని, ఇలా చేయడం ద్వారా ఈటలను సొంత పార్టీలో బద్నాం చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE