తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతునట్టు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలుగా ఉంది. 4వ తరగతి ఉద్యోగులకు 60 సంవత్సరాలుగా, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధన సిబ్బందికి 65 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో అమల్లో ఉంది. అలాగే న్యాయ సిబ్బందికి 60 సంవత్సరాలుగా ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60, 62 సంవత్సరాలుగా అమల్లో ఉంది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతూ, ఈ బిల్లును సభ ముందుకు తీసుకురావడం జరిగింది. జీవితకాల పెరుగుదల, మెరుగైన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. అలాగే అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ కమిషన్ కూడా ఈ విషయాన్ని నివేదించింది. పలు ఉద్యోగ సంఘాలతో కూడా సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకున్నాం” అని పేర్కొన్నారు.
త్వరలోనే 50 వేల ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల:
“అలాగే ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో ఖాళీల భర్తీ విషయంలో ఎలాంటి ప్రభావం ఉండకుండా, ఉద్యోగులకు వెంటవెంటనే ప్రమోషన్స్ ఇస్తూ, ఖాళీలను భర్తీ చేసే పక్రియను చేపడతాం. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే ఈ 50 వేల ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయడం జరుగుతుంది” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మంత్రి ప్రసంగం అనంతరం ఉద్యోగుల వయోపరిమితి పెంపు సవరణ బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ