తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయకు కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, పోలీసులు బండి సంజయ్ ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17వ తేదీ వరకు బండి సంజయ్ కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి కరీంనగర్ లో జాగరణ పేరుతో సంజయ్ దీక్ష చేపట్టారు. అయితే, దీక్షకు అనుమతి లేదని.. కోవిడ్ నిబంధనలు అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసు జారీ చేసినా సంజయ్ వెనక్కి తగ్గలేదు. దీంతో మూడు గంటల ఉత్కంఠ తర్వాత బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ నుంచి కరీంనగర్ కోర్టుకు తరలించి హాజరు పరిచారు.
ఈ అంశంపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేపట్టిన బండి సంజయ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బండి సంజయ్ దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదు. దీక్షాస్థలిలో మాస్కులు ధరించని 25 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఎంపీ అరెస్ట్ నేపథ్యంలో పోలీసులపై దాడులకు పాల్పడి విధులకు ఆటంకం కలిగించిన 16 మందిపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని కూడా తెలిపారు. మొత్తంగా 60 మందిని విడుదల చేసి నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా సభలు, సమావేశాలకు అనుమతి లేదు అని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ