అధిష్టానం ఆదేశిస్తే ఉత్తరప్రదేశ్లోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ మథురలో కృష్ణ మందిరం నిర్మిస్తామని బీజేపీ నినదించటం విశేషం. ఈ తరుణంలో.. మథుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని సీఎం యోగిని స్థానిక ఎంపీ జయప్రద ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో.. అయోధ్య, మథుర, లేదా సొంత జిల్లా గోరఖ్పూర్లలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు, యోగి పైవిధంగా సమాధానమిచ్చారు.
అయితే, ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేశానన్నారు. సీఎంగా అన్ని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చానని ఉద్ఘాటించారు. యూపీ సీఎంగా చేసిన వారిలో ములాయం సింగ్ ఆఖరిసారిగా 2003లో అసెంబ్లీకి పోటీ చేశారు. తర్వాత సీఎంలుగా పనిచేసిన మాయావతి, అఖిలేశ్ ఎమ్మెల్సీలుగా కొనసాగడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేసే అవకాశాల్లేవని ఈ మధ్య ప్రకటించిన మాజీ సీఎం అఖిలేశ్.. ఆ విషయం పార్టీయే నిర్ణయిస్తుందంటూ ఆ తర్వాత మాటమార్చారు. కాశీ, అయోధ్యల్లో మాదిరిగా మథుర పుణ్యక్షేత్రంలో కూడా అభివృద్ధి పనులు అద్భుతంగా కొనసాగుతున్నాయని సీఎం యోగి అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ