రంజాన్ ఉపవాస దీక్షను పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం పాతబస్తీలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. చార్మినార్ సమీపంలోని కులీ కుతుబ్షా స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్, ఏఐసీసీ మైనార్టీ సెల్ చైర్మన్, ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘడి, జానారెడ్డి, పొన్నాల, షబ్బీర్ అలీ, వీహెచ్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు. అలాగే పార్టీలోని పలువురు మైనార్టీ నాయకులతో పాటు ముస్లింలు ఈ ఇఫ్తార్ విందుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్లో మొదటినుంచి కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసి మెలిసి జరుపుకొంటారని, అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అయితే కొన్ని పార్టీలు, కొందరు నేతలు చక్కగా కలిసి మెలిసి ఉంటున్న ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో ప్రకటించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఎందుకు ఆ హామీని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన పాలనపై అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం పోయిందని, ఇక తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే ముస్లింలు అందరికీ ప్రతినిధులుగా చెప్పుకునే ఎంఐఎం పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కానీ దీనిపై ఎందుకు నోరెత్తడం లేదు? దేశంలో మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదు? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE