తెలంగాణలో వెలుగుచూసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం గవర్నర్ వద్దకు చేరింది. శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను తెలంగాణ బీజేపీ నేతలు పలువురు కలిశారు. ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన వారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీకి కొత్త కమిషన్ వేయాలని, పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నేతలు గవర్నర్ను కోరారు. అలాగే పేపర్ లీకేజీ వలన నష్టపోయిన విద్యార్థులకు రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కూడా వారు సూచించారు. ఈ మేరకు కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గవర్నర్కు అందజేశారు.
కాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసిన వారిలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, సీనియర్ నేతలు విఠల్, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంతో పాటు మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా నిన్న గన్పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన చేపట్టగా, అడ్డుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE