ఆగస్టు 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మరో 26 బస్తీ దావాఖానా లను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆగస్టు 11, మంగళవారం నాడు మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని అధికారులతో సమీక్ష జరిపారు. 26 బస్తీ దవాఖానాలను తనతో పాటుగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలి ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, మేయర్, డిప్యూటీ మేయర్ లు ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనేదే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యమని చెప్పారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాదు జిల్లాలో 95, రంగారెడ్డి జిల్లా లో 32, మేడ్చల్ జిల్లాలో 40, సంగారెడ్డి జిల్లాలో 3 చొప్పున ఇప్పటికే 170 బస్తీ దావఖానాలను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్తీ దావఖానాల ద్వారా ప్రతి రోజు సుమారు 14 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారని, నూతనంగా 26 దవాఖానాల ప్రారంభంతో అదనంగా మరో 2 వేల మందికి వైద్యసేవలు అందుతాయని చెప్పారు. ఈ బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక అటెండర్ విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వీటికి అదనంగా హైదరాబాదు జిల్లా పరిధిలో 18, మేడ్చల్ జిల్లాలో 6, రంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున మరో 26 నూతన బస్తీ దవాఖానా ల ప్రారంభంతో వాటి సంఖ్య 196 కు చేరుతుందని వివరించారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ప్రత్యేక ఆలోచనలతోనే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300 బస్తీ దావఖానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, ప్రజల అవసరాలను బట్టి రానున్న రోజులలో మరిన్ని బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాలలో విద్యుత్, త్రాగునీరు, చిన్న చిన్న మరమ్మతులు వంటి ఇతర సమస్యలు ఉంటే వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు వైద్యం, విద్య రంగాలతో పాటు, గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు. వేలాది రూపాయలను ఖర్చు చేసి వైద్య చికిత్సలు పొందలేకపోతున్న పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను కూడా ఉచితంగానే అందించడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu