తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు రైతు రాత మార్చే ‘వేదిక’లుగా మారుతున్నాయని, ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం నాడు రైతువేదికలు, నర్సంపేటలో మిరప పరిశోధన కేంద్రంపై శాసనసభలో సభ్యులు రసమయి బాలకిషన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, రమావత్ రవీంద్ర కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
“రైతువేదికలు రైతు రాత మార్చే ‘వేదిక’లు. ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు. ఇది సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోనే జరిగింది. వ్యవసాయం మీద పట్టు రావాలంటే ప్రతి అంగుళంలో ఏం జరుగుతుంది అన్నది తెలిసుండాలి. అందుకే ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందే సీఎం కేసీఆర్ రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2601 రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, 2556 రైతు వేదికల నిర్మాణం పూర్తి అయింది. 22 రైతు వేదికలను దాతలు స్వయంగా నిర్మించారు. మంత్రి కేటీఆర్ ఆరు, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లతో పాటు నేను స్వయంగా రెండు రైతు వేదిలను నిర్మించడం జరిగింది” అని మంత్రి తెలిపారు.
రైతువేదికలలలో రైతులకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు:
“రైతులకు నూతన వంగడాలు, నూతన సాగు పద్దతులు, రైతుల విజయగాధలు వ్యవసాయానికి సమగ్ర అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయి. రైతువేదికలలలో రైతులకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రైతువేదికల పారిశుద్ధ్యం నిర్వహణ పూర్తిగా గ్రామపంచాయతీలదే. రైతువేదికల నిర్వహణకు నెలకు రూ.8 వేలు కేటాయిస్తూ ప్రణాళిక రూపొందించడం జరిగింది. వ్యవసాయ రాష్ట్రంగా పురోగమిస్తున్న తెలంగాణలో రైతుల ఆలోచనా విధానాన్ని మార్చాలన్నదే మా ప్రయత్నం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ను పరిశీలించి లాభదాయక పంటల సాగు వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉంది. సాగునీటి వసతితో పాటు వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులకు ఊతమిస్తున్న నేపథ్యంలో వారిని నూతన పంటల సాగువైపు మళ్లించడానికి ఇది సరైన సమయం అని భావిస్తున్నాం. కందులు, వేరుశనగ, పత్తి, మిర్చి పరిశోధనలకు కేంద్రాలు సహా వ్యవసాయం బలోపేతానికి నిరంతర పరిశోధనలు చేస్తున్నాం. ఇక నర్సంపేటలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటు విషయం పరిశీలనలో ఉంది” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ