తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మార్చ్ 25, బుధవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. కోవిడ్-19( కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న లాక్డౌన్ విజయవంతంగా అమలవుతున్నదని, రాబోయే రోజుల్లో కూడా ఇంతే పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కరోనా వైరస్ కట్టడికి సోషల్ డిస్టెన్సింగ్(సామాజిక దూరం) కు మించిన మార్గం లేదని, అందుకే లాక్ డౌన్ ను విధిగా పాటించాలని ప్రజలను కోరారు.
ముందుగా ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రస్థాయి పోలీసులు, వైద్య శాఖల అధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం పరిస్థితిని సమీక్షించారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెదిలిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని సీఎం అధికారులను కోరారు. చికిత్స పొందుతున్నవారి పట్ల, క్వారంటైన్ లో ఉన్నవారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యాధి లక్షణాలు ఉన్నవారెవరైనా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కరోనా వైరస్ పై చేస్తున్న యుద్ధంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు, వైద్యశాఖ సిబ్బంది, పారిశుధ్య ఉద్యోగులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.