వరుస బహిరంగ సభలతో గులాబీ బాస్ హోరెత్తిస్తున్నారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ దూకుడుగా వెళ్తున్నారు. తమ ప్రభత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. 100 నుంచి 110 స్థానాల్లో గెలుపొంది తీరుతామని చెప్పుకొస్తున్నారు. అటు ప్రత్యర్థి పార్టీలపై కూడా నిప్పులు చెరుగుతున్నారు. పదునైన మాటలతో ప్రత్యర్థులకు తూట్లు పొడుస్తున్నారు. వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో తన ప్రసంగాల్లో ఎటువంటి నెగటివ్ అంశాలు రాకుండా జాగ్రత్తపడే కేసీఆర్.. మొదటిసారి ఓటమి గురించి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పిరికెడు మందిమని.. ఇప్పుడు చెప్పలేనంత సైన్యమని అచ్చంపేట సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. కల్లిబొల్లి మాలు నమ్మి.. తమను ఓడగొడితే.. తమకు నష్టమేమీ లేదని, ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటామని చెప్పారు. ఓటు వేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్న కేసీఆర్.. లేదంటే నష్టపోయేది ప్రజలేనని చెప్పుకొచ్చారు. చెప్పడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇలానే ఓ సభలో ప్రసంగించారు. టీడీపీ ఓడిపోతే తమకు వచ్చే నష్టం ఏమీ లేదని.. ప్రజలే నష్టపోతారని చెప్పారు. ఓటమి భయం వల్లే ఆయన అలా వ్యాఖ్యానించారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లుగానే చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అంటువంటి వ్యాఖ్యలే చేయడంతో.. ప్రత్యర్థి పార్టీల నేతలు సెటైర్లు పేల్చుతున్నారు.
అయితే కేసీఆర్ ఓడిపోతామనే భయంతో కాకుండా.. సరికొత్త వ్యూహంతో ఈ వ్యాఖ్యలు చేశారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఓడిపోతే తమకేమీ నష్టం ఉండదని కేసీఆర్ చెబుతూనే.. ఓడిస్తే తామే నష్టపోతామనే సందేశాన్ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లారని చెబుతున్నారు. ఈ వ్యూహంతోనే కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ