తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాపై పలువురు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జూలై 10, శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్కు సంబంధించిన ఫిర్యాదులు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కొరతకు దారితీస్తున్న పరిస్థితులపై కీలకంగా చర్చించారు. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, టాస్క్ఫోర్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మరియు డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజివ్స్ విభాగాలకు సంబంధించిన సంయుక్త బృందాలు ఆక్సిజన్ సరఫరాపై ఆసుపత్రులను మరియు డీలర్లను పరిశీలన చేయనున్నట్టు చెప్పారు.
ఆక్సిజన్ సిలిండర్ల అమ్మకం మరియు వినియోగం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కోవిడ్ -19 రోగులకు చికిత్స చేస్తున్న అన్ని ఆసుపత్రులకు సిలిండర్ల వాడకం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి క్రయోజెనిక్ లిక్విడ్ ఆక్సిజన్ వెస్సెల్స్/ ట్యాంకులు వాడాలని సూచించారు. ఆక్సిజన్ సిలిండర్ల నిల్వను కలిగి ఉన్న వ్యాపారులు పెసో నుండి లైసెన్స్ కలిగి ఉండాలని, లేకపోతే ఎక్స్ ప్లోజివ్స్ చట్టం ప్రకారం విచారణ చేయబడతారని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu