కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ రకంగా సీజ్ చేసిన వాహనాలను లాక్డౌన్ ముగిశాక కోర్టులో చలానా కట్టి విడిపించుకోవాలని ప్రకటించారు. అయితే రోజురోజుకి సీజ్ చేస్తున్న వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో, వాటిని భద్రపరచడంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సీజ్ చేసిన వాహనాలకు సంబంధిత రుసుము వసూలు చేసి ఆయా యజమానులకు తిరిగి అందించాలని ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు/స్టేషన్ హౌస్ అధికారులను డీజీపీ ఆదేశించారు.
నియమాలకు అనుగుణంగా నిబంధనలు ఉల్లంఘించినవారు/యజమానులు కాంపౌండింగ్ రుసుమును చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే వాహన పత్రాల జిరాక్స్ కాపీలను రికార్డు నిమిత్తం సమర్పించాలని చెప్పారు. ఒకవేళ అవసరమైతే చెప్పిన చోట కోర్టులో వాహనాలను సమర్పిస్తామని ధృవీకరణ/అవగాహన పత్రాన్ని వాహనదారులు లిఖితపూర్వకంగా సమర్పించాలని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శక పద్ధతిలో వచ్చే వారంలోగా పూర్తి చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu